న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ఐటీ, బీపీఓ వంటి సేవా రంగ కంపెనీలు తమ ఉద్యోగులకు కల్పించిన ఇంటి నుంచి పని పద్ధతిని కొనసాగిస్తుండగా, ఈ విధానం సరిపడని తయారీరంగ కంపెనీలు పలు జాగ్రత్తలతో సిబ్బందిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ కోసం తమ కంపెనీలు, ఫ్యాక్టరీల్లో క్యాంప్ లు ఏర్పాటు చేసేలా ప్రైవేట్ దవాఖానలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఆయా కంపెనీల ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టేందుకు అపోలో హాస్పిటల్స్, ఫోర్టిస్ హాస్పిటల్స్, మాక్స్ హాస్పిటల్, మెడికా వంటి హాస్పిటల్ చైన్స్ పలు సంస్థలతో చర్చిస్తున్నాయి.
కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ క్యాంప్ ల కోసం పలు ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయని ఫోర్టిస్ హాస్పిటల్స్ జోనల్ డైరెక్టర్ (బెంగళూర్) మనీష్ మాటూ పేర్కొన్నారు. గతంలో వ్యాక్సినేషన్ కోసం వారానికి ఓ ప్రతిపాదన రాగా ఇప్పుడు ఇప్పుడు 30 వరకూ వినతులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కోరుతూ తమ హాస్పిటల్ చైన్ కు దేశవ్యాప్తంగా కార్పొరేట్ల నుంచి ఎంక్వయిరీలు వస్తున్నాయని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ప్రెసిడెంట్ కే హరిప్రసాద్ పేర్కొన్నారు.