రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గొప్ప పరిణామం ఏమంటే మన చరిత్రను, సాహిత్యాన్ని, సంస్కృతిని ములాల్లోకి వెళ్లి అన్వేషించడం, వాటిని రికార్డు చేయడం జరుగుతున్నది. అలాగే సాంఘిక, రాజకీయ, విద్య, వైద్య, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కృషిచేసిన తెలంగాణ మహనీయుల జీవిత విశేషాలను మన పరిశోధకులు వెలుగులోకి తెస్తున్నారు. మామిడి హరికృష్ణ , విష్ణుభట్ల ఊదయశంకర్ సంయుక్త సంపాదకత్వంలో వెలువడిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ ఈ కోవకు చెందిన గ్రంథాల్లో అమూల్యమైనది. 153 మంది తెలంగాణ వైతాళికుల సుడిగుండాల జీవన నదులను ఈది వచ్చిన చరితార్థుల వివరాలు ఈ గ్రంథంలో రాయడం విశేషం.
కష్టజీవులకు తన కళను అంకితం చేసిన చిందుల ఎల్లమ్మ!, తెలంగాణకు గర్వకారణమైన ఒగ్గు కథకు మారుపేరైన చుక్క సత్తయ్య, ‘ఊరు మనదిరా- ఈ వాడ మనదిరా’ అంటూ.. పాటలెన్నో రాసి, పాడిన గూడ అంజయ్య, నాటకం, సినిమా రంగాల ద్వారా మన సంస్కృతీ, సాహిత్యాలకు చిరస్మరణీయమైన సేవలందించిన చందాల కేశవదాసు, సామాజిక, రాజకీయ సంస్థల్లో సభ్యురాలిగా సేవలందించిన సుమిత్ర దేవి, మంత్రి శ్రీనివాసరావు రంగస్థల శాఖకు చేసిన సేవలు మరువరానివి. ఇలాంటి వైతాళికుల జీవన రేఖలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
మన జాతీయ గీత రచయిత రవీంద్ర కవీంద్రుడని అందరికీ తెలుసు. ఆ గీతం పూర్తికాగానే ‘జైహింద్’ నినాద సృష్టికర్త అబిద్ హసన్ సఫ్రానీ అన్న సంగతి ఈ గ్రంథంలోని జి.వెంకట్రామారావు వ్యాసం చదివితే తెలుస్తుంది. సఫ్రానీ హైదరాబాద్ వాస్తవ్యులు కావటం మనకు గర్వకారణం. వెలుదండ నిత్యానందరావు వ్యాసం తెలంగాణ గత చరిత్రకు సంబంధించిన అనేక కొత్త అంశాలను తొలిసారి చెప్పినవారు ఆదిరాజు వీరభద్రరావు అని తెలుస్తుంది.
కష్టజీవులకు తన కళను అంకితం చేసిన త్యాగమూర్తి, చిందుల ఎల్లమ్మ! నాలుగేండ్ల ప్రాయంలోనే బాలకృష్ణుని వేషధారణ చేసి, ఆ తర్వాత ‘చిందు బాగోతం’ సంప్రదాయానికి చిరునామాగా మారిపోయారు. సిపాయిల తిరుగుబాటు కాలంలో వీరమరణం పొందిన తుర్రేబాజ్ఖాన్, తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ, శ్రీ శ్రీ వారసుడనిపించుకున్న అలిశెట్టి ప్రభాకర్, బి.ఎన్.శాస్త్రి, బిరుదురాజు రామరాజు, వినోబాభావేకు దానం చేసిన పల్లెర్ల హనుమంతరావు, చిత్రకారుడు కాపు రాజయ్య, విసునూరు రామచంద్రారెడ్డిని ఎదిరించిన ధీరుడు జోగ్యా నాయక్, ‘పేరిణి ’ నాట్యాన్ని పునరుద్ధరించిన నాట్యయోగి నటరాజ రామకృష్ణ, తెలంగాణ టైగర్గా పేరుపొందిన రైతాంగ పోరాటయోధుడు నల్లా నరసింహులు, అభ్యుదయ కవి మఖ్దూం మోహియుద్దీన్.. ఇట్లా చరిత్రలో ఆదర్శాల అడుగుజడలు పరిచివెళ్లిన త్యాగధనులెందరో, ‘తెలంగాణ తేజోమూర్తులు’ గ్రంథంలో దర్శనమిస్తారు.
ఈ గ్రంథంలో ఉన్న మరో విశిష్ఠత ఏమంటే, ఇది తెలంగాణ వైతాళికుల గురించిన జీవిత విశేషాలను అందచేయడమే కాక, వారి ఫొటోలను రంగులలో ముద్రించారు. ఈ గ్రంథంలో మహనీయుల చిత్రాలను కూడా పుస్తకం చివరన దాదాపు 48 పేజీల్లో అందించడం ద్వారా, మహనీయుల రూపాలను కూడా చూసే అవకాశం లభించింది. భారతదేశాన్ని ఒక్క దగ్గర చూడాలనుకుంటే తెలంగాణలో అడుగుపెడితే చాలు అనేంతగా అనాది కాలం నుంచి అనంతమైన ప్రత్యేకత, విశిష్ఠత కలిగిన భూమి తెలంగాణ! ఈ ‘తెలంగాణ తేజోమూర్తుల’ కాంతిపుంజాలు చీకటి మూలలను కూకటివేళ్లతో కూల్చివేసి చరిత్రను దేదీప్యమానం చేస్తున్నాయి.