హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): జోగులాంబ గద్వాల జిల్లా మేడికొండ గ్రామ శివారులోని ఫకీరోనిమిట్ట వద్ద ఉన్న కొండ గుహల్లో కొత్తరాతి చిత్రాలు బయటపడ్డాయి. సముద్రమట్టానికి 239 మీటర్ల ఎత్తులో 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పున్న రాతి కాన్వాసుపై ఈ చిత్రాలను ఆదిమానవులు గీశారు. వీటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హనుమయ్యగారి వేమారెడ్డి, టీ పద్మారెడ్డి, ఎస్ హన్మంతరెడ్డి శుక్రవారం గుర్తించారు. ఈ రాతి చిత్రాలలో దుప్పులు, వేటాడుతున్న పెద్దపులి, అడవిపంది, ఇద్దరు మనుషుల బొమ్మలు ఉన్నాయి. ‘దుప్పి రాతి చిత్రాలు తెలంగాణలోని పలుచోట్ల కనిపించినప్పటకీ ఈ చిత్రం ప్రత్యేకం. దుప్పులలో ఒక దుప్పి పెద్దకొమ్ములతో కనిపిస్తున్నది. పెద్దపులి రాతి చిత్రాలు పాండవులగుట్ట, గోపరాజుపల్లి, హస్తలాపూర్, వట్టిమల్లలో కనిపించాయి. మేడికొండలో పెద్దపులి వేటాడుతున్నట్టు చిత్రం ఉన్నది. అలాగే ఇద్దరు మానవుల పుల్లగీతలు, అడవిపంది చిత్రాలు అపూర్వమైనవి’ అని వారు తెలిపారు. తెలంగాణలో రాతి చిత్రాల తావుల సంఖ్య 2013లో 18 మాత్రమే ఉండగా, ప్రస్తుతం 60 దాటాయి. పురావస్తుశాఖ 18, ఇతరులు 16, కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధనల్లో 26 కిపైగా తావులు గుర్తించినట్టు హనమయ్యగారి వేమారెడ్డి తెలిపారు.