హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ హైటెక్స్ సమీపంలో గతవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడి స్నేహితుడిని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో కారు నడిపేందుకు అంగీకరించిన ఆరోపణలపై కేసు నమోదు. వివరాలిలా ఉన్నాయి. ఎం.ఇంద్రజిత్ వర్మ, బి.విశ్వతేజ ఇరువురు స్నేహితులు. మార్చి 26న కారులో ప్రయాణిస్తుండగా హైటెక్స్ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న విశ్వ తేజ తీవ్రగాయాలై చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇరువురు మద్యం సేవించినట్లుగా తేలింది. దీంతో మద్యం మత్తులో కారు నడిపేందుకు అంగీకరించాడన్న ఆరోపణలపై ఇంద్రజిత్ వర్మను పోలీసులు అరెస్టు చేశారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు పోలీసులకు సమాచారం అందించడం గానీ, అంబులెన్స్కు కాల్ చేయడం గానీ ఇంద్రజిత్ చేయలేదు. అంతేకాకుండా సంఘటనా స్థలం నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
అరెస్టు చేసిన వర్మను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి జూడిషియల్ కస్టడీకి తరలించారు. కలిసి మద్యం సేవించిన వ్యక్తులు అవతలి వ్యక్తి డ్రైవ్ చేసేందుకు అంగీకరిస్తే అతను కూడా విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్ తెలిపారు.