హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నిబంధనలను అనుసరించి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకున్నారు. సామూహిక ప్రార్థనల జోలికిపోకుండా చాలాప్రాంతాల్లో అధికశాతం ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలను ఇండ్లలోనే నిర్వహించారు. వేల మంది సామూహిక ప్రార్థనలతో కిక్కిరిసే చారిత్రక చార్మినార్ మక్కామసీదు, మీర్ ఆలం ఈద్గా ప్రాంతాలు బోసిపోయి కనిపించాయి. అలయ్బలయ్ కాకుండా ఫోన్లలో, భౌతికంగా దూరంపాటిస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లింలకు ముఖ్యమంత్రి మొదలుకుని పలువురు ఈద్-ముబారక్ తెలిపారు.
పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గంగాజమున తెహజీబ్కు అద్దం పడుతుందని, రంజాన్ పర్వదినం మతసామరస్యం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ‘ప్రళయం వస్తున్న సమయంలో కూడా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దానిని నాటాలి’ అని మహమ్మద్ ప్రవక్త బోధించారని ఆయన గుర్తుచేశారు. మొక్కలు నాటడం ఎంత ప్రధానమో ప్రవక్త ఆనాడే స్పష్టంచేశారని, అందుకే ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.