హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో జరిగే ప్రమాదాలపై మున్సిపల్శాఖ అప్రమత్తమైంది. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని జీహెచ్ఎంసీ, సీడీఎంఏ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మున్సిపల్ కమిషనర్లకు, ఇంజినీరింగ్ విభాగం అధికారులకు బుధవారం మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఇటీవల మణికొండ, షాద్నగర్ మున్సిపాలిటీల్లో ప్రమాదాలతో ప్రాణనష్టం జరిగింది. నీటి సరఫరా, డ్రైనేజీ పనులు, వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు చేపట్టే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రమాదకరమైన సమస్యలు ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకుపోవాలని పేర్కొన్నారు.