మోర్తాడ్/భీమ్గల్/ బోధన్ రూరల్/శక్కర్నగర్/భీమ్గల్, జూలై12: జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో చెక్డ్యాములు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వరినాట్లు జోరందుకున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోర్తాడ్ మం డలం గాండ్లపేట్ పెద్దవాగు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకుంది. ధర్మోరా మొండివాగు నుంచి పెద్దవాగులోకి ఎక్కువమొత్తంలో నీళ్లు రావడంతో పాలెం చెక్డ్యాం నీటితో కళకళలాడుతున్నది. పాలెం, గాండ్లపేట్ చెక్డ్యాముల నుంచి నీళ్లు పారుతున్నాయి. పెద్దవాగులోకి నీళ్లు రావడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బోధన్ మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు, వంకలు పారుతున్నాయి. చెరువులో కొత్త నీరు వచ్చి చేరుతున్నది. రాత్రి కురిసిన వర్షానికి లంగ్డాపూర్ వాగు పారుతున్నది. భీమ్గల్ మండల కేంద్రంలోని కప్పలవాగుపై నిర్మించిన చెక్డ్యాం నిండుకుండలా మారింది.
సోమవారం ఉదయం నుంచి పొంగిపొర్లుతున్నది. కప్పల వాగుపై చెక్డ్యాం నిర్మించి నీటిని ఒడిసి పట్టిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రెంజల్ మండలం కందకుర్తి వద్ద సోమవారం ఉదయం నుంచి గోదావరి పరవళ్లు తొక్కుతున్నది. పొరుగున ఉన్న మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు మత్తడి దుంకుతున్నాయి. గోదావరినదిలోకి భారీగా నీరు చేరే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులు పుష్కర ఘాట్ల వద్దే స్నానాలు ఆచరించాలని తహసీల్దార్ రాంచందర్ సూచించారు. మండలంలో 120. 6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. బోధన్ మండలంలోని వాగులు, చెక్డ్యాంలపై నుంచి నీరు పారుతోంది. బోధన్-నిజామాబాద్ రహదారిలోని నర్సాపూర్ వాగులో, పంజాబ్ వాగులో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది ఎడపల్లి పెద్దవాగులో చెక్డ్యాం పైనుంచి నీరు పారుతున్నది.
బోధన్ డివిజన్లో వర్షపాతం వివరాలు
బోధన్ డివిజన్లోని మండలాల వారీగా ఈనెల 11న సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలను డివిజనల్ గణాంకాధికారి లక్సీరాం వెల్లడించారు. రెంజల్ మండలంలో 120.6 మిల్లీ మీటర్లు, ఎడపల్లి మండలంలో 57.4 మి.మీ, బోధన్ మండలంలో 89.2 మి.మీ, కోటగిరి మండలంలో 31 మి.మీ, రుద్రూర్ మండలంలో 28 మి.మీ, వర్ని మండలంలో 27.2 మి.మీ, చందూర్లో 20 మి.మీ, మోస్రా మండలంలో 37 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు.
వేముగంటి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
భీమ్గల్ మండలం కారేపల్లిలోని వేముగంటి ప్రాజెక్టు నుంచి పల్లికొండ చెరువుకు సోమవారం నీటిని విడుదల చేశారు. నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు నిండడంతో దిగువకు నీటిని విడుదల చేసినట్లు వేముగంటి ప్రాజెక్టు చైర్మన్ రాజేందర్గౌడ్ తెలిపారు. ఐడీసీ అధికారి నాగేశ్, రణధీర్, నర్స య్య, రైతులు పాల్గొన్నారు.