హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఓడించాలని తెలంగాణలోని బీసీ సంఘాలు తీర్మానం చేశాయి. ఒక్క హుజురాబాద్లోనే కాదు ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అక్కడ కూడా బీజేపీని ఓడిస్తాం అని బీసీ సంఘాలు హెచ్చరించాయి. బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీకి ఓటు వేయద్దు అని పిలుపునిచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఒక్క పథకం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదని పేర్కొన్నాయి. కర్ణాటక, మహారాష్ట్రాల బీజేపీ నేతలు స్వయంగా తెలంగాణలో తమ గ్రామాలను కలుపుకోవాలి డిమాండ్ చేస్తున్నారు అని బీసీ సంఘాలు గుర్తు చేశాయి.
బీసీ సంఘాల రాష్ట్ర స్థాయి నేతలు హైదరాబాద్లోని ఓ హోటల్లో సమావేశమై హుజూరాబాద్ ఉప ఎన్నికపై చర్చించారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీకి బుద్దిచెప్పాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని తీర్మానం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల హక్కుల కోసం, అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. బీసీ జనగణనకు బీజేపీ వెనుకడుగు వేస్తోంది. ఈ దేశంలో కోట్ల మంది ఉన్న బీసీలకు బీజేపీ ఏం పథకాలు అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని అన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదల చూస్తుంటే భయమేస్తోందన్నారు. బీసీ బంధు పథకం పెడుతామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు అని కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల కోసం గురుకులాలు ఏర్పాటు చేశారు. గొల్ల, కురుమలను, మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని స్పష్టం చేశారు.