హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. మహాత్మా జ్యోతిపూలే జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్మార్ట్ పాఠాల కోసం బీసీ స్టడీసర్కిల్ డిజిటల్ స్టూడియోను ప్రారంభించారు. లక్షకుపైగా ఉద్యోగార్థులకు సకల సౌకర్యాలతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న బీసీ స్టడీ సెంటర్లను ప్రారంభిస్తామని చెప్పారు.
డిజిటల్ వేదికగా లక్షలాది విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తామన్నారు. వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని వెల్లడించారు. డిజిటల్ స్టూడియోలో రూపొందించిన పాఠాలను యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తామని తెలిపారు. బీసీ స్టడీ సెంటర్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు. స్టడీ సెంటర్లలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సిద్దిపేట, గద్వాలలో నూతన స్టడీ సర్కిళ్లను ప్రారంభించామన్నారు. సిరిసిల్లలో త్వరలో స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..