జూన్లో 10 నెలల కనిష్ఠాన్ని తాకుతూ రూ.92,849 కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ, జూలై 6: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో తగ్గుముఖం పట్టాయి. లక్ష కోట్ల రూపాయల దిగువకే పరిమితమయ్యాయి. గడిచిన ఎనిమిది నెలల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిరుడు అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే వరకు రూ.లక్ష కోట్లపైనే జీఎస్టీ ఆదాయం నమోదైంది. కానీ జూన్లో 10 నెలల కనిష్ఠాన్ని తాకుతూ రూ.92,849 కోట్లకు పడిపోయింది. గతేడాది ఆగస్టు తర్వాత ఇదే అత్యంత తక్కువ. 2020 ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు రూ.86,449 కోట్లుగా ఉన్నాయి. అయితే గతేడాది జూన్తో పోల్చితే మాత్రం ఈసారి ఆదాయం 2 శాతం పెరిగింది. 2020 జూన్లో రూ.90,917 కోట్లుగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. కాగా, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వచ్చిపడిన లాక్డౌన్లు వ్యాపారాలను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలోనే జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయినట్లు ప్రభుత్వ వర్గాలు తాజా గణాంకాలను విశ్లేషిస్తున్నాయి.