నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే8 : ప్రభుత్వ ఆదేశాల మేరకు జ్వర సర్వే మూడో రోజైన శనివారం సైతం కొనసాగింది. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వైద్యారోగ్య, రెవెన్యూ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల, ఆరోగ్య పరిస్థితుల వివరాల ను నమోదు చేసుకున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి మందులను అందజేశారు. కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
బాన్సువాడ పట్టణంతోపాటు మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వేను చేపట్టారు. పంచాయతీ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు బృందంగా ఏర్పడి గ్రామాల్లో ఆరోగ్య వివరాలను సేకరించారు. పలువురికి మందులను అందజేశారు.
దోమకొండ మండలకేంద్రంలో ఇంటింటి హెల్త్ సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వివరాలను నమోదు చేసుకున్నామని, పలువురికి మెడికల్ కిట్లను అందజేశామని పంచాయతీ కార్యదర్శి సౌజన్య తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్గౌడ్, ఉపసర్పంచ్ శ్రీకాంత్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
లింగంపేట మండలంలోని వివిధ గ్రామా ల్లో జ్వర సర్వే కొనసాగింది. కరోనా లక్షణాలు ఉన్న వారికి వైద్యారోగ్య సిబ్బంది మందులను అందజేశారు.
నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో గురువారం ప్రారంభమైన జ్వర సర్వే శనివారం ముగిసింది. మూడు రోజుల నుంచి వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరిస్థితులను రిజిస్టర్లలో నమోదు చేసుకున్నారు. మండలవ్యాప్తంగా 7,279 ఇండ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో 254 మందికి జ్వరం, జలుబు ఉండడంతో వారికి ఇంటి వద్దే మందులను అందజేశారు. పోచారం గ్రామంలో సర్వేను ఎంపీడీవో రఘు పరిశీలించారు. కార్యక్రమాల్లో వివిధ గ్రామాల సర్పంచులు, అంగన్వాడీలు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పిట్లం మండలంలోని పిట్లం, తిమ్మానగర్, కారేగాం, జగదాంబ తండా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్యశాఖ, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితలను నమోదు చేసుకున్నారు. నివేదికను మండలస్థాయి అధికారులకు అందజేస్తామని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు విఠల్రెడ్డి, హన్మంత్రావు, వినోద్, జాకీర్హుస్సేన్, ఆశవర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట్ మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో వైద్యారోగ్య సిబ్బంది సర్వే నిర్వహిం చారు..
నిజాంసాగర్ మండలంలో ఇంటింటి జ్వర సర్వే శనివారంతో పూర్తయింది. మండలంలోని పలు గ్రామాల్లో వైద్యారోగ్య సిబ్బంది శనివారం సర్వేను కొనసాగించారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో చేపట్టిన సర్వేను తహసీల్దా ర్ వేణుగోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో మూడు రోజుల్లో సర్వేను పూర్తిచేశామని తెలిపారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సంతోష్, ఏఎన్ఎం సునీత, అంగన్వాడీ కార్యకర్తలు విజయలక్ష్మి, ఎలిజబెత్, వీఆర్ఏ లచ్చయ్య తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలో ఇంటింటి సర్వేని వైద్య సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణం లో వైద్య సిబ్బందితోపాటు ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించారు. జ్వరంతో ఉన్న వారిని గుర్తించి వారికి మందులు అందజేసి పలుసూచనలు చేశారు.
రాజంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటా సర్వే కొనసాగింది. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని మండలంలోని పీహెచ్సీకి తరలిస్తున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్ మండలకేంద్రంలో వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. ఇంట్లోని వ్యక్తులకు జ్వర పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్గౌడ్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
గాంధారితోపాటు అన్ని గ్రామాల్లో జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారి వివరాలను వైద్యారోగ్య సిబ్బంది నమోదు చేసుకున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి మందుల కిట్లను అందజేసి పలు సూచనలు చేశారు.