హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు పొడిగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్ధుల సౌకర్యార్ధం, వారి అడ్మిషన్ లెటర్ ఆధారంగా కొవిడ్ వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయాలని వైద్యశాఖను ఆదేశించింది.
పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్డుకు (5.5 కి.మీ) ‘పి వి నర్సింహారావు మార్గ్’ (పీవీఎన్ ఆర్) గా నామకరణం చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అతి తక్కువ సంఖ్యలో హాజరై జరుపుకోవాలని, ఆయా జిల్లాల్లో మంత్రులు అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించింది.
కరోనా కారణంగా రాష్ట్రం కోల్పోతున్న ఆదాయాన్ని సమీకరించుకునేందుకు చేపట్టవలసిన చర్యల గురించి కేబినెట్ ఈ సందర్భంగా చర్చించింది. ప్రభుత్వ భూముల అమ్మకం, గృహ నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్న భూములు, ఇండ్ల అమ్మకం కొరకై తక్షణమే చర్యలను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది.