హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగబద్ధమైన బీసీ జాతీయ కమిషన్ బీసీ కులగణన విషయంలో ప్రేక్షకపాత్ర పోషించవద్దని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సూచించారు. సోమవారం ఆయన బీసీ సంఘాల నేతలతో కలిసి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ భగవాన్లాల్ సహానీతో హైదరాబాద్లో సమావేశమయ్యారు. దేశంలో 56 శాతం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అన్యాయం జరుగుతున్నదని, ఈ పరిస్థితిని మార్చేందుకు జాతీయ బీసీ కమిషన్ కృషి చేయాలని చెప్పారు.
రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే విషయమై రాజ్యాంగ సవరణ చేయాలని, బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్ నిబంధనను తొలగించాలని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో రిజర్వేషన్లను 27 నుంచి 56 శాతానికి పెంచాలని.. ఇలా మొత్తం 16 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని కృష్ణయ్య జాతీయ బీసీ కమిషన్ చైర్మన్కు అందజేశారు.
బీజేపీకి ఓట్లేయం
కేంద్రం బీసీ కులగణన చేపట్టకపోతే బీజేపీకి ఓట్లు వేయబోమని ఆర్ కృష్ణయ్య తేల్చిచెప్పారు. బీఎస్ఎన్ఎల్, రైల్వేస్, బ్యాం కింగ్, పోర్టులుసహా అనేక ప్రతిష్ఠాత్మక సంస్థల్ని అమ్మేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులగణన, రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మం గళవారం ఉదయం బీసీ సంఘాలు, కులసంఘాలతో లక్డికాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్టులోఅఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.