హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగం బీసీలకు కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు తెలిపారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని చెప్పారు. బుధవారం బీసీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ కులాల సమగ్ర వికాసానికి కమిషన్ పనిచేస్తుందని, అణగారినవర్గాల గొంతుకగా వ్యవహరిస్తుందని, రాజ్యాంగబద్ధంగా అన్నివర్గాలకు అండగా నిలబడుతుందని చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, హక్కుల పరిరక్షణకు కృషిచేస్తామని తెలిపారు. బీసీవర్గాల సామాజిక స్థితిగతులు క్షుణ్ణంగా తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమని పేర్కొన్నారు. బీసీ గణన చేపట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏ ప్రభుత్వానికైనా ఆయావర్గాల జనాభా తెలిస్తేనే వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఉద్యమాలతో మమేకమైనవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ చైర్మన్, సభ్యులుగా నియమించారని పేర్కొంటూ సభ్యుల గతానుభవాలను వివరించారు. కమిషన్ చైర్మన్గా అవకాశం కల్పించిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులుగా కే కిశోర్గౌడ్, శుభప్రదపటేల్, సీహెచ్ ఉపేంద్ర బుధవారం ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకరించారు. కార్యక్రమానికి బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.