న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడుకు లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ఆరు సూచనలు చేయడంతోపాటు అఖిలపక్ష భేటీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల సమావేశాలను వర్చువల్గా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దేశ ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్ర బడ్జెట్లో కేటాయించిన రూ.35,000 కోట్లు వినియోగించాలని ప్రధాని మోదీని ఖర్గే కోరారు. అలాగే వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి తప్పనిసరి లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్ఆర్ఈజీఏ)ను 200 రోజులకు పెంచాలని పేర్కొన్నారు. విదేశాల నుంచి అందుతున్న వైద్య సామగ్రి పంపిణీని వేగవంతం చేయాలని, అవి ఎక్కడకు రవాణా చేస్తున్నారన్న విషయాన్ని ముందుగానే వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కాగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం సోమవారం జరుగనుండగా దీనికి ముందు ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత ఖర్గే లేఖ రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇప్పటికే సోనియా గాంధీ కరోనా గురించి బహిరంగంగా ప్రస్తావించగా, రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.