హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. తెలంగాణ ఆడబిడ్డలు తారతమ్య బేధం లేకుండా సంబురంగా జరుపుకునే పండుగ ఇది.. పండుగ పూట ఏ ఆడబిడ్డ ముఖం చిన్నబోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏడాది పెద్ద మనసుతో ఆడబిడ్డలకు సారెలను కానుకగా అందిస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ సంవత్సరం 30 సరికొత్త డిజైన్లను రూపొందించి వాటిని 20 విభిన్న రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చీరలన్ని జరి అంచులతో తయారు చేయబడి, 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్, నూలుతో తయారు చేయబడినవి.
ఇప్పటికే జిల్లా కలెక్టర్లచే ఎంపిక చేయబడిన గోదాములకు బతుకమ్మ చీరలు చేరినవి. గ్రామ, వార్డు స్థాయి కమిటీల ద్వారా అక్టోబర్ 2 నుంచి గ్రామాల్లో చీరల పంపిణీ జరగనుంది.
2017లో 95, 48,439 మంది మహిళలకు, 2018 లో 96,70,474 మందికి, 2019 లో 96,57,813 మందికి, 2020 లో 96,24,384 మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ ఏడాది కోటి మందికి పైగానే చీరలను పంపిణీ చేయనున్నారు.