హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ‘గుడ్ఫ్రైడే’ను పురస్కరించుకొని ఏసుక్రీస్తు బోధనలలోని మానవీయతత్వాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్మరించుకున్నారు. ఏసుక్రీస్తు సిలువ వేయబడిన గుడ్ఫ్రైడే రోజును స్మరించుకుంటూ క్రిస్టియన్ సోదరులు ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. క్రీస్తు మానవాళికి ఇచ్చిన శాంతి సందేశాన్ని గుడ్ఫ్రైడే సందర్భంగా అందరూ పునఃశ్చరణ చేసుకోవాలని సీఎం కోరారు. ‘కరుణామయుడైన క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి సహనం, త్యాగం వంటి విలువలు, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళి అనుసరించతగినవి’ అని సీఎం అన్నారు. కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గుడ్ఫ్రైడే ప్రార్థనలు జరుపుకోవాలని క్రిస్టియన్ సోదరులను కోరారు.
శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా
మానవాళి క్షేమం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఏసుప్రభువు అని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ స్మరించుకున్నారు. ‘గుడ్ఫ్రైడే’ను ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా జరుపుకోవాలని సూచించారు. ఏసుప్రభువు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ‘గుడ్ఫ్రైడే’ను కరోనా నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని క్రిస్టియన్ సోదరులను కోరారు.