గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది అడవిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం శిలాజాలను గుర్తించింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి పక్కనే ఉన్న వందలాది సున్నపురాయి గుండ్లను చరిత్రబృందం సభ్యుడు బీ వేణుగోపాల్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. దక్కన్లో 6.5 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించిన అగ్నిపర్వతం పేలుడుతో ప్రహహించిన లావా ఈ నేలంతా పరచుకొని బసాల్ట్రాతి దిమ్మెలుగా, రాతిరేకులుగా, రాతి ఉండలుగా మారిపోయాయని వివరించారు. వీటిలో నత్తగుల్లలు, ఆల్చిప్పలు, ఆకులు, వృక్షభాగాలతో పాటు చారోఫైట్స్, ఆస్ట్రోపోడ్స్ మొదలైన సూక్ష్మ శిలాజాలు విస్తారంగా ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని జీఎస్ఐ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల్రావు ధ్రువీకరించారు. ఈ సందర్భంగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ మాట్లాడుతూ.. ఈ శిలాజాలకు భద్రత కల్పించి జియోగ్రాఫికల్ మాన్యుమెంట్గా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.