హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): బంజారాల హస్తకళకు దేశ, విదేశాల్లో గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. బంజారా సంప్రదాయ చేతికుట్లు, ఆభరణాలు, అల్లికలపై ప్రత్యేక డాక్యుమెంట్ను రూపొందించిన గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణాసంస్థ.. ఆ వివరాలను కేంద్రానికి పంపి జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) కోసం ప్రతిపాదించింది. గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ, అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్), ఫెడరేషన్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంస్థల సమన్వయంతో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల బంజారా ఎంబ్రాయిడరీ, బంజారా ఆభరణాలను తయారుచేస్తున్న 30 మంది బంజారా మహిళలను గుర్తించి వారి కళ స్థితిగతులను తెలుసుకున్నది. వారికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మూలధనం పెట్టుబడి అవసరాలను గుర్తించటానికి ఇటీవల వర్క్షాప్ను నిర్వహించింది. కళపై ఆధారపడ్డ వారికి శాశ్వత ఉపాధి కల్పించేందుకు జీఐ కోసం దరఖాస్తు చేసింది. వారు తయారుచేసిన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో చోటు దక్కుతుందన్నది సర్కారు ఆలోచన. నిర్మల్ కొయ్యబొమ్మలు సహ ఇప్పటివరకు రాష్ట్రంలో జీఐ గుర్తింపు సాధించిన హస్తకళ ఒక్కటీలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి జీఐ రిజిస్ట్రేషన్కు కావాల్సిన అన్ని లాంఛనాలను పూర్తిచేస్తున్నది. రాష్ట్రంలోని గిరిజన హస్తకళ కళాకారులకు పని కల్పించటమే కాకుండా ప్రస్తుత మార్కెట్కు అనువైన రీతిలో ఉత్పత్తులను తయారు చేయటానికి నిఫ్ ప్రొఫెసర్లతో శిక్షణ ఏర్పాటు చేశామని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ తెలిపారు. బంజారా ప్రత్యేక హస్తకళకు ప్రభుత్వమే తోడ్పాటునివ్వటం గొప్ప విషయమని నిఫ్ట్ ప్రొఫెసర్ జ్యోతిర్మయి సింగోతు తెలిపారు. కళాకారులకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని రాష్ట్ర మ్యూజియం క్యూరేటర్ ద్యావపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.