హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నీటి హక్కులను కేంద్రానికి తాకట్టు పెట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిధిని నోటిఫై చేయాలంటూ.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు శనివారం లేఖ రాశారు. ఆ లేఖను శనివారం రాత్రి ఆయన మీడియాకు విడుదల చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని నోటిఫై చేయడం ద్వారా ఏపీ, తెలంగాణాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ అంతా బోర్డు పరిధిలోకి తేవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మొదట్నుంచీ ఇదే డిమాండ్ చేస్తున్నది. ఆ రాష్ట్ర సీఎం జగన్ ఇటీవలే మరోసారి కేంద్రానికి ఈ అంశంపై లేఖ కూడా రాశారు. ఆ లేఖలోని అంశాలను సమర్థిస్తున్నట్టుగానే తెలంగాణ ఎంపీగా ఉన్న సంజయ్ కేంద్రానికి లేఖ రాశారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో బండి లేఖను బట్టే అర్థమవుతున్నది.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయని అంగీకరించారు. ఈ పథకం ప్రారంభం నుంచి దీనిపై తెలంగాణ అభ్యంతరం చెప్తూనే ఉన్నది. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. బండి సంజయ్ తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ 50 శాతం పూర్తయిన తర్వాత కానీ ఆయనకు ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదని, కేంద్ర సర్కారుకు ఇంతకాలం ఎందుకు లేఖలు రాయలేదని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ ప్రాజెక్టు పనులును ఏపీ సగం వరకు పూర్తిచేసేదాకా బీజేపీ సర్కారు ఉదాసీనంగా వ్యవహరించిందని స్వయంగా బండి సంజయ్ తన లేఖ ద్వారా ఒప్పుకున్నారని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రాంత నీటి హక్కుల రక్షణ కోసమే ఉద్యమాన్ని ప్రారంభించి, స్వరాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్, తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో విఫలమయ్యారన్న వింతవాదనకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకోకపోవడం వల్లనే ట్రిబ్యునల్ ఏర్పాటు తాత్సారమైందంటున్న సంజయ్కి.. కేసు ఉపసంహరించుకొని మూడు నెలలు దాటినా కేంద్రం ట్రిబ్యునల్ను ఏర్పాటుచేయకపోవడాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీస్తున్నారు.