సంగారెడ్డి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర ఒక పెద్ద డ్రామా అని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు. ఆదివారం ఆందోల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాదయాత్రలో బండి సంజయ్ ప్రజల సమస్యలు తెలుసుకోవటం మాని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
బండి సంజయ్ కంటే ఎక్కువగా తాము దూషించగలమని, అయితే సభ్యత అడ్డువస్తున్నట్లు చెప్పారు. మరోమారు కేసీఆరే జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల కోసం చేసే పాదయాత్రలు ఇలా ఉండవన్నారు. కేసీఆర్ పాదయాత్ర అలంపూర్ నుంచి గద్వాల వరకు గతంలో చేసారు. రోజుకు 40 కిలోమీటర్లు నడిచారరని, ఎక్కడా హైవేపై నడవలేదన్నారు.
బండి పాదయాత్ర మీద పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. పార్టీలో బలం పెంచుకునేందుకు వ్యక్తిగత సమస్యలు అధిగమించేందుకు ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. బండి మాటలు ప్రజల్లో ఉద్రిక్తత పెంచేలా ఉన్నాయన్నారు.. వైకుంఠం దామాలు, రైతువేధికలకుడబ్బులు కేంద్రం ఇస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో అవి ఉన్నాయా అని ప్రశ్నించారు. పాదయాత్ర పెద్ద పొలిటికల్ డ్రామా అన్నారు. మీ డ్రామాలు ఎక్కువ రోజు సాగవు అని బీజేపీ నాయకులను హెచ్చరించారు.
మా కేసీఅర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, కేంద్రం, పలు రాష్ట్రాలు ఇక్కడి పథకాలను కాపీ కొడుతున్నాయని తెలిపారు. . కేటీఆర్ 1.50 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఇదివరకే చెప్పారని తెలిపారు. కేంద్రం ఇస్తా అన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.