హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ గాంధీ దవాఖాన సందర్శనంతా ప్రచారం కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించటంపై సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆపత్కాలంలోనూ నీచ రాజకీయాలు చేయడం బండికే చెల్లిందంటూ పలువురు విమర్శించారు. సీఎం కేసీఆర్ గాంధీ పర్యటనపై చిత్తం వచ్చినట్టుగా మాట్లాడటాన్ని తప్పుపట్టారు. గాంధీలో సీఎం కేసీఆర్ ఐసీయూ వార్డుల్లో కలియతిరుగుతూ కరోనా రోగులను పరామర్శించడంతోపాటు సమస్యలు తెలుసుకున్న విధానం మీకు కనిపించలేదా? అని పలువురు నేతలు ప్రశ్నించారు. డాక్టర్లు, సిబ్బందితో సీఎం మాట్లాడటం కూడా కనిపించలేదా అని నిలదీశారు. బీజేపీ నేతలు కండ్లున్న కబోదులని మండిపడ్డారు.