అనారోగ్యం పేరిట ఈటల డ్రామా
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్
ఇల్లందకుంట, ఆగస్టు 1: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మతిభ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇకమీదట బీజేపీ ఆటలు సాగవన్నారు. అబద్ధాలు చెప్పడం, అసత్యప్రచారం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి పోతే బండి, కారు పోతే కారు ఇస్తానని మాయమాటలతో ప్రజలను మోసంచేశాడని, అలాగే హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలువడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కొత్త డ్రామాకు తెరలేపాడని, పాదయాత్రలో అస్వస్థతకు గురైనట్టు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెడితే ఆపేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని, కోర్టులో కేసులు వేస్తున్నదని ఆక్షేపించారు. ఈటల తన అల్లుడి కాళ్లు కడిగిన పాపాన పోలేదు కానీ, దళితులతో పాదాలకు పాలతో కడిగించుకోవడమేమిటని ప్రశ్నించారు. క్యూ న్యూస్ మల్లన్న సైతం ప్రభుత్వంపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని, ఆయన్ను ఎర్రగడ్డ దవాఖానలో చేర్పించాలన్నారు.