సికింద్రాబాద్, జనవరి 7 : ఆధునిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుంది. క్లిష్టమైన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. నూతన టెక్నాలజీతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది. అయితే నాణానికి మరో వైపు అన్నట్లుగా నేటి యువత టెక్నాలజీతో జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాల్సింది పోయి అంధకారంలో కూరుకుపోతున్నది. అందుకు ఉదాహరణ ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ విద్యార్థులు, యువత భవితను భుగ్గిపాలు చేసుకుంటున్నారు. విలువైన ప్రాణాలు పొగొట్టుకొని కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నారు.
స్నేహితుడి వద్దే దొంగతనం..
గత కొద్ది రోజుల క్రితం దిల్సుఖ్నగర్ ఏరియాలోని ఓ బాయ్స్ హాస్టల్లో అద్దెకు ఉంటున్న ఓ విద్యార్థి మొబైల్కు ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో రమ్మీ గేమ్ ఆడండి, రూ.3,000 బోనస్ పొందండి అని ఉంది. టైంపాస్ చేయడంతో పాటు డబ్బును సంపాదించండి అని ఆన్లైన్ లింక్ను కూడా పంపారు. సరే ఓ సారి ఆడి చూద్దాం అని రమ్మీ ఆడటం మొదలుపెట్టిన ఆ విద్యార్థి క్రమంగా రమ్మీ గేమ్కు బానిసయ్యాడు. పగలు, రాత్రి తేడా లేకుండా ఆన్లైన్లో పేకాట ఆడేస్తున్నాడు. ఓ నెల తర్వాత తన గదిలోని సహచరుడి రూ.5 వేలను దొంగతనం చేసి పట్టుబడ్డాడు. విచారించగా తేలింది ఏంటంటే తాను రమ్మీలో రూ.60 వేలు పొగొట్టుకున్నానని, వాటిని సంపాదించటానికి డబ్బులు లేక దొంగతనం చేశానని, గెలవగానే తిరిగి ఇచ్చేద్దామనుకున్నానని జవాబిచ్చాడు. మూడేళ్లుగా తమకు తెలిసిన స్నేహితుడు ఇలా ఎలా మారాడా? అని ఆశ్చర్యపోవటం వారి వంతయింది.
భూ పరిహారం సొమ్ము రూ. 95 లక్షలు..
ఆన్లైన్ గేమ్ ఆడి రూ. 95 లక్షలను పోగొట్టుకున్న ఘటన కొద్ది రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని సీతారాంపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డికి ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు శ్రీకాంత్ రెడ్డి బీటెక్, రెండో కొడుకు హర్షవర్ధన్ రెడ్డి డిగ్రీ చదువుతున్నారు. శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి పది ఎకరాల భూమి ఉంది. ఇటీవల ప్రభుత్వం భూసేకరణ జరపడంతో దాదాపు కోటి ఇరవై ఐదు లక్షలు శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి పరిహారంగా ప్రభుత్వం ఇచ్చింది. అయితే శ్రీనివాస్రెడ్డి రెండో కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి ఆన్లైన్ గేమ్కు అలవాటు పడ్డాడు. తన తండ్రి, తల్లి అకౌంట్లో ఉన్న రూ. 95 లక్షల డబ్బును తన అకౌంట్లో వేసుకున్నాడు. ఆన్లైన్ గేమ్లో భాగంగా కింగ్ 567 గేమ్ లింక్ను క్లిక్ చేస్తూ ఆట ఆడుతూ మొత్తం పోగొట్టుకున్నాడు. రూ. 95 లక్షల వరకూ ఆన్లైన్ గేమ్ల ద్వారా హర్షవర్ధన్ రెడ్డి పోగొట్టుకున్నట్లు కుటుంబ సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు కోటి రూపాయలను కోల్పోయిన ఆ కుటుంబం లబోదిబోమంటున్నది.
బెట్టింగ్కు బానిసై తనవు చాలించి..
2022 ఆక్టోబర్ 11వ తేదీన తిరుమలగిరికి చెందిన యువకుడు ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్కు బానిసై తనవు చాలించాడు. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన రామకృష్ణ అనే యువకుడు సుమారు రూ.10 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురై సెల్ఫీలో తన బాధను చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తల్లిదండ్రులు లేని తనకు స్నేహితుడే రమ్మీకి బానిస చేశాడంటూ ఆరోపణలు గుప్పించాడు. తనలాగాఎవరూ మోసపోవద్దని ఆన్లైన్ గేమ్లకు దూరంగా ఉండాలని సూచించాడు. ఇది ఆన్లైన్ రమ్మీ గేమ్తో పాటు ఆన్లైన్ గేమ్లు ఆడే వారి పరిస్థితి.
సరదాగా మొదలై..
అవసరాల కోసం స్మార్ట్ఫోన్ వాడాల్సిందిపోయి జూదానికి వాడటంతో అనర్ధాలను కొనితెచ్చుకుంటున్నారు. సరదా కోసం స్మార్ట్ఫోన్లో ఆటలు ఆడటం మొదలు పెట్టి అప్పులపాలవుతున్నారు. బెట్టింగ్కు బానిసలుగా మారుతూ జీవితాలను ప్రమాదంలో పడేసు కుంటున్నారు.
రమ్మీదే అగ్రస్థానం..
ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్లలో రమ్మీదే ప్రధమ స్థానం. రమ్మీ కోసం
ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను డౌన్లోడ్ చేసుకొని లాగిన్
అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. గేమ్ను ఆడేలా ప్రోత్సహించేందుకు ముందుగా కొంత మొత్తంలో నగదును ఫ్రీగా వేస్తారు. ఆ డబ్బుతో ఆడటం మొదలు పెట్టిన వినియోగదారుడు కంపెనీ ఇచ్చిన డబ్బులు పోగా తన సొంత డబ్బు వేలకు వేలు పెట్టి ఆడేలా బానిసను చేస్తారు. ఆన్లైన్ బెట్టింగ్ల్లో డబ్బులు పోగొట్టుకుంటున్న ఆడవారి సంఖ్య కూడా భారీగానే ఉంటున్నది.
క్రికెట్ లవర్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
పేకాట తర్వాత ఎక్కువగా ఇష్టపడే గేమ్ క్రికెట్, దాన్ని కూడా ఆన్లైన్ గేమింగ్ నిర్వాహకులు ఒడిసి పట్టుకుంటున్నారు. డ్రీమ్ 11 యాప్ పేరిట ఓ కొత్త గేమ్ను ప్రవేశపెట్టారు. ఇందులో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరు జట్లలోని 11 మంది నచ్చిన ఆటగాళ్లను ఎంచుకొని వారి మీద బెట్టింగ్ కట్టవచ్చు. కబడ్డీ, వాలీబాల్ వంటి గేమ్స్కు కూడా బెట్టింగ్ అడే సదుపాయం ఉంది.
జీవితాలు నాశనం..
విద్యార్థులు, యువత ఆన్లైన్ గేమ్స్కు బానిసలై అప్పుల పాలవుతున్నారు. క్రమంగా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ మనీ గేమ్స్ను బ్యాన్ చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా నిషేధం అమలులో ఉంది. ఇలాంటి గేమ్స్ జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
తల్లిదండ్రులదే బాధ్యత..
చట్ట విరుద్ధమైన ఆటలు ఆడటం నేరం. అలాంటి వాటికి పాల్పడిన వాళ్లు, వాటిని నిర్వహిస్తున్న వాళ్లు, చివరకు వాటిని ప్రోత్సహిస్తున్న వాళ్లు సైతం చట్టపరమైన శిక్ష అనుభవించక తప్పదు. యువత చెడుమార్గంలో వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారు? రోజూ ఎక్కడికి వెళ్తున్నారనే విషయాలపై ఆరా తీస్తూ ఉండాలి.
– పరవస్తు మధుకర్ స్వామి,డీసీపీ, హైదరాబాద్