శ్రావణ మాసం మొత్తం వెదురు కట్టెలతోనే నడక
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ గూడేల్లో ఖొడంగ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా శ్రావణమాసానికి ముందు వచ్చే చుక్కల అమావాస్య నుంచి పొలాల అమావాస్య వరకు ఖొడంగ్ పండుగను గిరిజనులు ఉత్సాహంగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా పిల్లలు వెదురు బొంగులతో చేసే ఖొడంగ్లపై నడస్తూ ఆటలాడుతారు. అందుకే ఈ పండుగను కట్టెగుర్రాల పండుగ అని కూడా అంటారు. చుక్కల ఆమావాస్య రోజు గ్రామ సమీపంలోని అడవుల నుంచి వెదురు బొంగులు తెచ్చి పిల్లల ఎత్తుకు తగ్గట్టుగా ఖొడంగ్లను తయారుచేస్తారు. నెల రోజులపాటు వాటిపై పిల్లలు ఊరంతా తిరుగుతూ ఉత్సవాలు చేస్తే ఎలాంటి కీడు జరగదని వారి విశ్వాసం. పండుగ తొలిరోజు పూజలు చేసి పశువులకు నైవేద్యం సమర్పిస్తారు. పొలాల అమావాస్య రోజు మళ్లీ పూజలు చేసి మూగజీవాలకు నైవేద్యం పెడుతారు. మరుసటి రోజు ఖొడంగ్లను తీసుకెళ్లి గ్రామ శివారలో విసర్జన చేస్తారు. సోమవారం పొలాల అమావాస్య అయిపోతున్నందున మంగళవారం ఉత్సవాలు ముగియనున్నాయి.