హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పర్యాటక, సాంస్కృతిక శాఖలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. రూ.726 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో కేటాయించిన రూ.385.62 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రూ.340.38 కోట్లు అధికం. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చే సందర్శకులను ఆకర్షించేలా కాళేశ్వరం బ్యాక్ వాటర్లో బోటింగ్, పార్కులు, వాటర్ గేమ్స్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదే కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పనులను ప్రారంభిస్తామని మంత్రి హరీశ్రావు బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఇందుకోసం రూ.350 కోట్లు కేటాయించారు. ముందు గా కాళేశ్వరం బ్యాక్ వాటర్లో రెండు బోట్లను ప్రారంభించనున్నారు. ట్యాంక్బండ్, దుర్గం చెరువులో మాదిరి 80 సీట్ల సామర్థ్యం కలిగిన క్రూజ్ బోట్ ఒకటి ఉంటుందని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. మానేరు ఫ్రంట్ రివర్లో పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు.