బంజారాహిల్స్, ఏప్రిల్ 3: కొంతకాలంగా ఎన్నికల కోడ్ అమలు కారణంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు ఇప్పటికే నడుస్తున్న పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్కిల్-18 పరిధిలోని బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్ డివిజన్లలో పనుల వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.86లో రోడ్డుపనులు, ఫిలింనగర్బస్తీల్లో పాడైన రోడ్లకు సంబంధించిన అంచనాలు రూపొందించి తనకు ఇస్తే నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
పలు బస్తీల్లో మురుగు సమస్యపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిధులు మంజూరైన పనులకు సంబంధించిన శంకుస్థాపనలకు తేదీలు ఖరారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ సర్కిల్-18 ఇంజినీరింగ్ విభాగం ఈఈ విజయ్కుమార్, జలమండలి జనరల్ మేనేజర్ హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలింనగర్ బస్తీల్లో మురుగు సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని జలమండలి జనరల్ మేనేజర్ హరిశంకర్ తెలిపారు. పలు బస్తీల్లో డ్రైనేజీ పొంగుతోందని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించి కొత్త డ్రైనేజీ లైన్ల కోసం ప్రతిపాదించాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశించారు.
శనివారం జలమండలి అధికారులు బస్తీల్లో పర్యటించారు. ఎంఆర్సీకాలనీ, బీజేఆర్నగర్, గౌతమ్నగర్, వినాయక్నగర్, భగత్సింగ్కాలనీ ప్రాంతాల్లో జీఎం హరిశంకర్తో పాటు అధికారులు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట కొత్త లైన్లు వేయడానికి ప్రతిపాదనలు రూపొందించి ఎమ్మెల్యే దానం నాగేందర్కు సమర్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత మామిడి నర్సింగరావు, నగేశ్సాగర్, ఆవుల రాజన్న, దాస్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.