ప్రతిరోజూ చెత్తసేకరణ
కంపోస్ట్ షెడ్డులో ఎరువుల తయారీ
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతివనాలు
వైకుంఠధామంలో సౌకర్యాల కల్పన
ఆనందం వ్యక్తంచేస్తున్న గ్రామస్తులు
బీర్కూర్, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ప్రభుత్వం అందజేస్తున్న నిధులతో గ్రామాల్లో మౌలిక సౌకర్యాలతోపాటు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ స్వచ్ఛ గ్రామంవైపు పరుగులిడుతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డుల నిర్మాణ పనులు పూర్తిచేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ శరత్ గ్రామంలో పర్యటించినప్పుడు పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసిన స్థలం తక్కువగా ఉన్నదని, మరింతగా పెంచాలని ఆదేశించారు.దీంతో దాని పక్కనే మరింత స్థలాన్ని తీసుకొని మరో పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేసి విరివిగా మొక్కలు నాటారు. ఈ ప్రకృతివనాలు తహసీల్, మండల పరిషత్, ఐకేపీ, వ్యవసాయ కార్యాలయాల సమీపంలో ఏర్పాటు చేయడంతో పరిసరాలు పచ్చదనం సంతరించుకున్నాయి. మండలంలోని ఆయా గ్రామాల నుంచి పనుల నిమిత్తం వచ్చే వారు విశ్రాంతి కోసం ఈ పల్లె ప్రకృతివనాల్లో సేదతీరుతున్నారు. గ్రామస్తుల సౌకర్యార్థం నిర్మించిన వైకుంఠధామంలో అన్ని ఏర్పాటు పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చారు. గ్రా మంలో చెత్తాచెదారం పేరుకుపోకుండా ప్రతిరోజూ సేకరిం చి, కంపోస్ట్ షె డ్డుకు తరలిస్తూ ఎరువులను తయారు చేస్తున్నారు.