కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. అదేవిధంగా న్యాయవాదులను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వ్యక్తులకు న్యాయవాదిని కోర్టు నియమించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం న్యాయ సేవాధికార చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం రావడానికి ముందు అంటే 1976 మే లో భారత ప్రభుత్వం జస్టిస్ పి.ఎన్.భగవతి అధ్యక్షతన ఓ జ్యుడికేచర్ కమిటీని ఏర్పాటుచేసింది. జస్టిస్ వి.ఆర్.క్రిష్ణయ్యర్ ఆ కమిటీలో సభ్యుడు. ప్రభుత్వం న్యాయసేవలను అందించడానికి అవసరమైన సూచనలను చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీని కోరింది. ఆ కమిటీ జాతీయన్యాయసేవల బిల్లును తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది.
రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1977లో ఆర్టికల్ 39 (ఏ)ని చేర్చారు. ఈ ఆర్టికల్ ప్రకారం- న్యాయ సహాయం అందరికీ అందుబాటులోకి రావాలి. ఆర్థిక దుస్థితి వల్లగానీ లేక మరే ఇతర కారణాల వల్లగానీ న్యాయాన్ని పొందే అవకాశం కొందరికి లేకుండా పోయే పరిస్థితి ఉండకూడదు. ఈ పరిస్థితిని నివారించేందుకు, అవసరమైన ఉచిత న్యాయ సహాయాన్ని అందించటానికి తగిన శాసనాలను, పథకాలను ప్రభుత్వం రూపొందించాలి. ఆ తర్వాత 1987లో కేంద్ర ప్రభుత్వం న్యాయసేవల అధికారాల సంస్థ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం 1995 నవంబర్ 9న అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని ప్రవేశిక ప్రకారం అర్హులైన వ్యక్తులకు యోగ్యత కలిగిన న్యాయసేవలు అందించాలి. అంటే న్యాయవాది మంచి న్యాయవాది అయి ఉండాలి.
కేసుల పరిష్కారం త్వరితగతిన జరగాలి. అదేవిధంగా కోర్టులు అవసరమైన సందర్భాల్లో వ్యక్తులకు మంచి న్యాయవాదిని ప్రభుత్వ ఖర్చుల మీద నియమించాలి. ఇదే విషయాన్ని శాసనం చెప్తుంది. సుప్రీంకోర్టు చాలా తీర్పుల్లో ప్రకటించింది. అయినా ఈ విషయానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదు. కొన్ని కోర్టులు సత్వరంగా పరిష్కరించాలనేదానికే ప్రాముఖ్యం ఇస్తూ నామమాత్రంగా న్యాయవాదులను నియమించి కేసులను పరిష్కరిస్తున్నాయి. అలాంటిదే ఓ కేసు సుప్రీంకోర్టు ముందుకువచ్చింది. అదే అనోకిలాల్ కేసు.
కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, అయితే ఆ క్రమంలో న్యాయాన్ని సమాధి చేయకూడదని సుప్రీంకోర్టు.. అనోకిలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ (ఏఐఆర్ 2020 సుప్రీంకోర్టు 232) కేసులో అభిప్రాయపడింది. యు.యు.లలిత్, ఇందూ మల్హోత్రా, క్రిష్ణ మురారీలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఈ తీర్పును 2019 డిసెంబర్ 19న ప్రకటించింది. 13 రోజుల్లో విచారణ ముగించి ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను, హైకోర్టు ధృవీకరణను సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఈ కేసులో ముద్దాయి రేప్, హత్య నేరాలను ఎదుర్కొంటున్నాడు. ఆ ముద్దాయికి న్యాయవాది లేడు. అందుకని ట్రయల్ కోర్టు న్యాయ సహాయకుడిని నియమించింది. కానీ కేసుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను పరిశీలించి అర్థం చేసుకునే సమయాన్ని ఆయనకు ట్రయల్ కోర్టు ఇవ్వలేదని సుప్రీంకోర్టు గమనించి ఈ ఉత్తర్వులను జారీచేసింది. అదేవిధంగా న్యాయ సహాయకుడికి ముద్దాయితో సంభాషించే సమయం కూడా ఇవ్వలేదని అభిప్రాయపడింది.
సత్వర న్యాయాన్ని అందించే క్రమంలో న్యాయ కారణాన్ని సమాధి చేయకూడదని కోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది. కేసును ముగిస్తూ, న్యాయ సహాయకులను నియమించే క్రమంలో కోర్టులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో న్యాయవాదిని కానీ, న్యాయ సహాయకుడిని కానీ నియమించేటప్పుడు, వారికి కనీసం పదేండ్ల అనుభవం ఉన్నదా అన్న విషయాన్ని కోర్టులు గానీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ గానీ గమనించాలి. మరణశిక్షలను ధృవీకరించే కేసుల్లో సీనియర్ న్యాయవాదిని నియమించడానికి హైకోర్టు మొదటగా చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత మిగతావాళ్లను నియమించాలి. ఎవరైనా న్యాయవాదిని న్యాయ సహాయకుడిగా నియమించినప్పుడు అతను కేసు గురించి చదువుకోవడానికి తగిన సమయాన్ని ఇవ్వాలి. ఈ విషయంలో స్థిర నియమం ఏమీ లేదు. అయితే కనీసం ఏడు రోజుల సమయం అనేది సముచితమైన, అవసరమైన సమయం. న్యాయ సహాయకుడు ముద్దాయితో కలిసి మాట్లాడుకునే వెసులుబాటును కల్పించాలని సూచించింది.
కేసులను సత్వరం పరిష్కరించడం ఎంత ముఖ్యమో, న్యాయ ఉద్దేశం దెబ్బతినకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. న్యాయవాదిని ఏర్పాటుచేసుకోలేని ముద్దాయిలకు న్యాయవాదిని నియమించడం ఎంత ముఖ్యమో, యోగ్యత గల న్యాయవాదిని నియమించడం అంతకన్నా ముఖ్యం.
జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో న్యాయవాదిని కానీ, న్యాయ సహాయకుడిని కానీ నియమించేటప్పుడు, వారికి కనీసం పదేండ్ల అనుభవం ఉన్నదా అన్న విషయాన్ని కోర్టులు గానీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ గానీ గమనించాలి. మరణశిక్షలను ధృవీకరించే కేసుల్లో సీనియర్ న్యాయవాదిని నియమించడానికి హైకోర్టు మొదటగా చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత మిగతావాళ్లను నియమించాలి.
మంగారి రాజేందర్
(వ్యాసకర్త: విశ్రాంత జిల్లా జడ్జి, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు)
ఇవి కూడా చదవండి..