హుజూరాబాద్ టౌన్, మే 30: రాజకీయ భిక్ష ప్రసాదించిన సీఎం కేసీఆర్ మీదనే మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుట్రలు చేయడం దారుణమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, సంక్షేమ పథకాలను ఎద్దేవాచేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాక్షేత్రంలో అలాంటివారికి తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు. బీజేపీ నుంచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన నాయకులు పోరెడ్డి శంతన్రెడ్డి, దండ విక్రమ్రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుడు కన్నెబోయిన శ్రీనివాస్యాదవ్ తదితరులు ఆదివారం వినోద్కుమార్, మంత్రి గంగులను హైదరాబాద్లో వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా వినోద్కుమార్, గంగుల మాట్లాడుతూ.. సబ్బండవర్గాల ఉద్యమంతో, ఎంతోమంది విద్యార్థుల బలిదానాలతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కల సాకారమైందని పేర్కొన్నారు.
ఈట ల వంటి నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. సీఎం చలవతోనే ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారని, రెండుసార్లు మంత్రి అయ్యారని.. ఇప్పుడు ముఖ్యమంత్రిపైనే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మరోవైపు, హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దొంత రమేశ్ హైదరాబాద్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు సందమల్ల బాబు, ముక్క శ్రీనివాస్, దొమ్మాటి వెంకన్న, తిరుపతి తదితరులు ఉన్నారు.