ముంబై, జూన్ 15:ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళనల్ని పక్కనపెట్టి, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో మంగళశారం స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డులు నెలకొన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 221 పాయింట్లు పెరిగి కొత్త రికార్డుస్థాయి 52,773 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్లు జంప్చేసి చరిత్రాత్మక గరిష్ఠం 15,869 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీలు రికార్డుల పరంపరలో ఇది వరుసగా నాల్గవరోజు. తాజా ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.231.58 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా ఆసియన్ పెయింట్స్ 3 శాతంపైగా పెరిగింది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు పెరిగిన షేర్లలో వున్నాయి. మరోవైపు బజాజ్ ఫిన్సర్వ్, డాక్టర్ రెడ్డీస్ లాబ్, టైటాన్, సన్ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, పవర్గ్రిడ్లు క్షీణించాయి.
కొవిడ్-19 సెకండ్వేవ్ తీవ్రతలో కూడా భారత ఈక్విటీ మార్కెట్ పటిష్టంగా ర్యాలీ జరిపిందని, వచ్చే ఏడాది మార్చికల్లా సెన్సెక్స్ 58,500 పాయింట్లస్థాయిని చేరుతుందని అంతర్జాతీయ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ జూలియస్బేర్ అంచనావేసింది. కొవిడ్వేవ్తో తాము షాక్ అయ్యామని, ఈ ఉత్పాతానికి స్పందించని మార్కెట్ను చూసి కూడా అంతే షాక్ అయినట్లు జూలియన్ బేర్ ఎండీ మార్క్ మాథ్యూస్ చెప్పారు. ఈ ఉదంతం ఇండియా మార్కెట్ బలాన్ని సూచిస్తున్నదని, తాజా కార్పొరేట్ ఫలితాల సీజన్ బావుందని, కార్పొరేట్ లాభాల వృద్ధి సెన్సెక్స్ను 58,500 పాయింట్లస్థాయికి నడిపిస్తుందన్న అంచనాల్ని ఆయన వ్యక్తంచేశారు. జొమాటో, ఫ్లిప్కార్ట్, గ్రోఫర్స్ వంటి ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల ఐపీఓల ద్వారా ఇండియా మరింతగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షించగలుగుతుందని మాథ్యూస్ అన్నారు.