హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృతోత్సవ్’లో భాగంగా ఈ నెల నుంచి ఏడాది పొడవునా రాష్ట్రంలో పలు సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణపై కేంద్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ..సైకిల్ ర్యాలీలు, ఐటీ, సినీ, సాంస్కృతిక రంగాల సహకారంతో కళాప్రదర్శనలు, విద్యారంగ సదస్సులు నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణలో ముఖ్య పండుగైన బతుకమ్మను కూడా 75 ఏండ్ల స్వాతంత్య్ర స్ఫూర్తితో నిర్వహిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ కూడా పాల్గొన్నారు.