హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టతనిచ్చారు. ఆయుర్వేద మందును శుక్రవారం నుంచి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయడానికి ఏర్పాట్లుచేసినట్టు తెలిపారు. ప్రకృతిలో దొరికే సహజసిద్ధ వస్తువులతో, ఆనందయ్య తయారుచేసే ఆయుర్వేద మందుతో ఎటువంటి హానీ ఉండదని, కొవిడ్ రోగుల ఆరోగ్యం కూడా కుదుటపడిందని పేర్కొన్నారు. ఆనందయ్య అందిస్తున్న మందు కోసం ఇతర రాష్ర్టాల నుంచి కూడా చాలామంది వస్తున్నారని వెల్లడించారు. కరోనా ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి శుక్రవారం నుంచి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించామని, కరోనా సోకినవారికి వేరుగా, కరోనా రాకుండా నియంత్రించడానికి వేరుగా భౌతికదూరం పాటిస్తూ మందులు పంపిణీ చేపడతామని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందుపై లోకాయుక్త దృష్టిపెట్టింది. ఆయుర్వేద మందులో ఔషధగుణాలు ఉన్నాయో? లేదో విచారణ జరుపాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. జిల్లా కలెక్టర్ కృష్ణపట్నంలో ఇచ్చే మందుపై ఎలాంటి అభ్యంతరాలు లేవని లోకాయుక్తకు తెలిపారు. ఆనందయ్య ఇచ్చే మందు తయారీ, ఎఫెక్ట్స్, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్తోపాటు ఈ మందు వాడినవాళ్లు ఆక్సిజన్ స్థాయి పెరిగినట్టు చెప్పారని కలెక్టర్ నివేదిక ఇచ్చారు. స్థానిక ప్రజలతో కూడా మాట్లాడామని, ప్రతిఒక్కరూ ఆయుర్వేద మందుపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తంచేశారని పేర్కొన్నారు. ఈ మందు వల్ల ఇప్పటివరకు ఎవరు ఎలాంటి ఇబ్బంది పడలేదని, ఇక్కడి వచ్చిన రోగులు మందు తీసుకున్న తర్వాత కోలుకున్నట్టు చెప్పారని తెలిపారు. సదరు ఆయుర్వేద చికిత్స ప్రక్రియ శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉన్నదని తెలిపారు.