ధర్పల్లి, మార్చి 30 : ఒకప్పుడు గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం, గుంతలమయమైన రోడ్లు, అస్తవ్యస్థ నీటి సరఫరా వ్యవస్థ వెరసి పల్లెలు ప్రగతికి ఆమడ దూరంలో ఉండేవి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతిని అందిపుచ్చుకున్న పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామం ఇందుకు ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి రోజూ పారిశుద్ధ్య నిర్వహణ, పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, రోడ్ల నిర్వహణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరాతో గ్రామంలో అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. గతంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి సరైన వసతులు లేవు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అందించిన నిధులతో గ్రామంలో పెద్ద చెరువు దగ్గర ఎర్రమన్ను గుట్ట వద్ద వైకుంఠధామం నిర్మించి అన్ని వసతులు కల్పించారు. పెద్ద చెరువు పక్కనే చిన్న రాతి గుట్టపై ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం గ్రామానికే వన్నె తెస్తున్నది. గ్రామస్తులు సేద తీరేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు. ధర్పల్లి-సీతాయిపేట్ రెండు గ్రామాల మధ్య అందంగా పొదిగి ఉన్న పెద్ద చెరువు కట్టపై మినీ ట్యాంక్బండ్ ఏర్పాటుతో కట్టకు కళ వచ్చింది. మినీ ట్యాంక్బండ్గా మారిన కట్ట, చెరువు అందాలను చూడడానికి వచ్చిన వారు తప్పకుండా పక్కనే ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనానికి వస్తున్నారు. గ్రామంలో పల్లె ప్రగతి పనులన్నీ పూర్తి చేసుకుని జిల్లా స్థాయిలో అవార్డును సైతం పొందింది.
ప్రతి రోజూ పర్యవేక్షణ..
పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండి పోకుండా, గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల నిధులను సద్వినియోగం చేసుకుంటున్నాం. గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా నిలబెట్టాం.
-తిరుపతి, కార్యదర్శి సీతాయిపేట్ గ్రామం
గ్రామస్తులందరి సహకారంతో..
గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నాం. గ్రామంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించి ప్రతి రోజూ నీరు పట్టించడం ద్వారా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు, మొక్కలు గ్రామంలోకి స్వాగతం పలుకుతున్నాయి. గ్రామంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా ఇంటింటికీ చెత్త బుట్టలను అందజేశాం.
-లొక్కిడి విజయ, సర్పంచ్