హైదరాబాద్ : నూతనంగా ప్రారంభించిన టీఎస్ ఆయిల్ ఫెడ్ వెబ్ అదేవిధంగా మొబైల్ ఆధారిత యాప్పై సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లకు గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. నగరంలోని పరిశ్రమ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాలకే పరిమితం అయిన ఆయిల్ పామ్ సాగును సీఎం కేసిఆర్ గారు ముందుచూపుతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించటం జరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్కు రెండు జిల్లాలతో పాటు మరో ఐదు(గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్) జిల్లాలను కేటాయించినట్లు తెలిపారు.
ఆయిల్ పామ్ సాగును వెగవంతం చేయటం కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థతో కలిసి టీఎస్ ఆయిల్ ఫెడ్ వెబ్ అదేవిధంగా మొబైల్ ఆధారిత యాప్ రూపొందించటం జరిగిందన్నారు. సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా రైతులు ఈ యాప్ ద్వారా భూమి వివరాలతో ఆయిల్ పామ్ మొక్కలు నాటడానికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
అలాగే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఈ యాప్ ద్వారా రైతులకు అవసరమయ్యే మొక్కల వివరాలు తెలుపొచ్చన్నారు. యాప్ జీపీఎస్తో అనుసందానం అయి ఉండటం వలన రైతుల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ సాగుకు సంబందించిన ఫోటోలు, వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసే అవకాశం ఉందన్నారు.టెక్నాలజీ అభివృద్ధి ఆయ్యేకొద్ది శ్రమ తగ్గుతుందన్నారు. ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్కు ఈ యాప్ పై అవగాహన ఉండాలన్నారు. ఆయా మండల అధికారుల సహకారంతో సమావేశాలు నిర్వహించి రైతులకు యాప్ పై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎండీ ఎం.సురేందర్, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, మానేజర్స్ తిరుమలేష్ రెడ్డి, జెన్ను సత్యనారాయణ, శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, యాప్ డిజైనర్స్ సీజీజీ సంస్థ అధికారులు, 50 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.