మహిళా క్రికెట్కు గతంతో పోలిస్తే మంచి ఆదరణే లభిస్తున్నది. ఈ నెలాఖరులో ఇంగ్లండ్ టూర్కి ఏర్పాట్లు చేసుకుంటున్నది ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్. ప్రస్తుతం ఆటగాళ్లంతా క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవలే టీమ్ ప్లేయర్లకు ముంబైలో మీటింగ్ జరిపి, వైట్ జెర్సీలను అందించారు. ఆ తర్వాత ప్రముఖ ఇండియన్ బ్యాట్స్ఉమన్, 20 ఏండ్ల జమీమా రోడ్రిగ్స్ ఒక నోట్ రాసింది. అందులో ఉమెన్ క్రికెట్కి పునాదులు వేసిన సీనియర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకొన్నది.
“మా కోచ్ రమేశ్ పవార్ సర్ మమ్మల్ని మీటింగ్కోసం పిలిచారు. ఆ సమయంలో మహిళా క్రికెట్ గురించి వివరంగా తెలిపారు. మొదటిరోజు నుంచి ఇప్పటి వరకూ చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. మా ముందు జనరేషన్ కృషి కారణంగానే, ప్రస్తుతం మేము ఈ స్థాయిలో ఉన్నామని అర్థమైంది. ఇదంతా సీనియర్ల వల్లే సాధ్యమైంది. ఎలాంటి గుర్తింపునూ ఆశించకుండా చాలామంది కష్టపడ్డారు. నిజానికి వాళ్లకు సరైన ఆదరణ లభించలేదు కూడా. ఆ అజ్ఞాత విజేతల గొప్పదనం ఈరోజు తెలిసొచ్చింది. ‘లీవ్ ద జెర్సీ ఇన్ ఎ బెటర్ ప్లేస్’ అనే అందమైన సందేశంతో మా టీమ్ మీటింగ్ ముగిసింది” అంటూ నోట్ను ముక్తాయించింది జమీమా. ఈ ఇంగ్లండ్ టూర్ జులన్ గోస్వామి, మిథాలీ రాజ్ సారథ్యంలో నడవనున్నది. ఇంగ్లండ్లో ఆడబోయే మ్యాచ్లన్నీ, క్రికెట్ కోసం కృషి చేసిన ప్రతి అమ్మాయి కోసమూ ఆడతాననీ, ప్రతి విజయం వారికే అంకితమనీ జమీమా అంటున్నది.