హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత సాంకేతిక యుగంలో సమాంతర ఇంటర్నెట్ ప్రపంచం తయారైంది. కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో పిల్లలు, మహిళలుసహా అన్ని వర్గాల ప్రజలు అధిక సమయం ఫోన్లతోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో టెక్నాలజీ ఆధారిత సైబర్ నేరాలబారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. అందుకే.. సైబర్ నేరాలను అరికట్టేందుకు 5 వేల మందికి రాష్ట్ర మహిళా భద్రతా విభాగం శనివారం జూమ్ విధానంలో ప్రత్యేక శిక్షణను ప్రారంభించింది. సైబర్ నేరాలపై చైతన్యం, అవగాహన కల్పించేందుకు సైబ్హర్కు కొనసాగింపుగా సైబర్ కాంగ్రెస్ పేరుతో 3,300 మంది విద్యార్థులు, 1,650 మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు 10 నెలలపాటు ప్రత్యేకశిక్షణ కొనసాగనున్నది.
ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. రెండేండ్లలో గ్రేటర్ హైదరాబాద్లోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సైబర్ నేరాల పై 36 వేలకుపైగా ఫిర్యాదులు అందాయని చెప్పా రు. రాష్ట్రంలో సైబర్ నేరాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, సైబర్ నేరాలను గుర్తించే విధానం తదితర అంశాలపై ఇప్పటికే పెద్దఎత్తున శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా 10 నెలల పాటు రాష్ట్రంలోని 33 జిల్లాలను 16 యూనిట్లుగా విభజించి, వీటిలో ఎంపికచేసిన 50 పాఠశాలలకు చెం దిన 100 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ శిక్షణ పొం దే పిల్లలు పోలీసులకు ముఖ్యంగా షీటీమ్లకు అంబాసిడర్లుగా ఉంటారన్నారు.
విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన మాట్లాడుతూ.. అవగాహన లేక యువత, మహిళలు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్నారన్నారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ.. రెండేండ్లలో 3 పోలీస్ కమిషనరేట్లలో సైబర్నేరాలపై ఫిర్యాదు లు గణనీయంగా పెరుగుతుండటం ఆదోళనకరంగా మారిందని చెప్పారు. 2019 సంవత్సరంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3,021 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,600, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 8,000 నమోదుకాగా.. 2020 సంవత్సరంలో వరుసగా 5,860, 6,027, 8,900 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 2021లో ఇప్పటికే రాచకొండలో 2 వేలు, హైదరాబాద్లో 2,600, సైబారాబాద్ కమిషనరేట్లో 3,600 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఫేస్బుక్, ఓఎల్ఎక్స్ తదితర మాధ్యమాల ద్వారా జరిగే ఆన్లైన్ మోసాలను తమంతట తామే తెలుసుకొనేలా సైబర్ నిపుణులతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి చైతన్య పరుస్తున్నామని తెలిపారు. జూమ్ సమావేశంలో విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ జీ రమేశ్, సైబర్రంగంలో నిపుణుడు రక్షిత్ తాండాన్, రుత్విక, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.