ఖమ్మం ఎడ్యుకేషన్, మే 8 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిధులు కేటాయిస్తున్నది. రాబోయే విద్యాసంవత్సరానికి సమగ్ర శిక్ష అభియాన్ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే సర్కార్ స్కూల్స్లో అన్ని మౌలిక వసతులు సమకూరాయి. మెరుగైన విద్యప్రమాణాలు అందించేలా ప్రణాళికలు తయారు చేశారు. 2021-22 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్ పనులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, పాఠశాలలకు అవసరమైన బడ్జెట్ను రూ.115 కోట్లతో తయారు చేసి రాష్ట్ర విద్యాశాఖాధికారులకు నివేదించారు.
ప్రమాణాలకు పదును..
విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నూతన సంస్కరణలు అమలు చేస్తున్నది. సైన్స్ ప్రయోగాల ద్వారా పరిజ్ఞానం పెంపొందించేందుకు కిట్స్ను అందిస్తున్నది. ఇప్పటికే గణితం, సైన్స్ కిట్లను ఉన్నత పాఠశాలలకు అందజేశారు. చిన్నచిన్న సమస్యలు ఉంటే పరిష్కరించేలా బడ్జెట్లో ప్రతిపాదనలు పొందుపర్చారు.
ప్రతిపాదనలకు అనుగుణంగా తరగతి గదులు
విద్యార్థులు చెట్లకింద చదవాల్సిన పరిస్థితి రాకుండా ప్రతి పాఠశాలలో అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నది. ఏటా అవసరమైనచోట ప్రతిపాదనలు తెప్పించి వాటికి అనుగుణంగా నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. ఇందులో భాగంగా 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి రూ.10.80 కోట్ల నిధులను ఇప్పటికే కేటాయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ పరిధిలోని పాఠశాలల్లో అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని 29 పాఠశాలల్లో 108 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.10.80 కోట్లు మంజూరయ్యాయి. 2021-22 విద్యాసంవత్సరంలో బడ్జెట్లో మరో రూ.10 కోట్లు ప్రతిపాదించారు.
టెన్త్ విద్యార్థులకు రవాణా అలవెన్స్లు..
సమగ్రశిక్షా అభియాన్ బడ్జెట్లో ఈ సారి దూర ప్రాంతాల నుంచి వచ్చే 9వ, 10వ తరగతి విద్యార్థులకు రవాణా అలవెన్స్లు ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయించారు. ఇప్పటి వరకు 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు అందించారు. ఈ ఏడాది నుంచి 9వ, 10వ తరగతి విద్యార్థులకు అందించనున్నారు. కిలోమీటరు దూరం నుంచి ప్రాథమిక పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రవాణా అలవెన్స్ కింద రూ.4 వేలు ఇస్తున్నారు. 3కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.6వేలు రవాణా అలవెన్స్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు 1,570 మంది విద్యార్థులు రవాణా అలవెన్స్లు పొందుతున్నారు. ఇప్పుడు 9వ, 10వ తరగతి విద్యార్థులకు ప్రయోజనం కల్పిస్తుండడంతో ఆ సంఖ్య 3,160కి చేరింది.
ఏడీ ఆధ్వర్యంలో సెక్టోరల్స్తో..
సమగ్రశిక్ష అభియాన్ బడ్జెట్ ప్రతిపాదనలు జిల్లా విద్యాశాఖ ఏడీ చావా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సెక్టోరల్ అధికారులు కలిసి రూపొందించారు. సెక్టోరల్ అధికారులు చల్లపల్లి ఉదయ్శ్రీ, సర్దార్పాషా, రాజశేఖర్, రామకృష్ణ, భానుప్రకాశ్ పలు అంశాలను పరిగణలోకి తీసుకుని తయారు చేశారు. వీటిల్లో ప్రధానంగా స్కూల్స్ బలోపేతానికి రూ.25 కోట్లు, క్వాలిటీ విద్యకు రూ.13 కోట్లు, కేజీబీవీలకు రూ.15 కోట్లు కేటాయించారు.
బడ్జెట్లో అధికంగా కేటాయించినవి..
రెసిడెన్షియల్ స్కూల్స్కి రూ.44 లక్షలు, రవాణా అలవెన్స్లకు రూ.రూ.1.85 లక్షలు, ఏకరూప దుస్తులకు రూ.5.63 లక్షలు, ఉచిత పాఠ్యపుస్తకాలకు రూ.2.44 లక్షలు, పాఠశాల గ్రాంటు రూ.3.52 లక్షలు, డిజిటల్ కార్యక్రమాలకు రూ.5.44 లక్షలు, అకడమిక్ సపోర్ట్ రూ.4.90 లక్షలు, టెక్నాలజీ సపోర్ట్ రూ.2.16 లక్షలు, ప్రాజెక్ట్ మ్యానేజ్మెంట్ రూ.3.48 లక్షలు కేటాయించారు. మొత్తంగా 30 అంశాలతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారు. రూ.115 కోట్ల 75 లక్షలకు పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ ప్రణాళిక తయారు చేశారు.