మిగతా రాష్ర్టాల కన్నా తెలంగాణ చాలా బెటర్
డిజిటలైజేషన్తోనే పరిపాలన భవిష్యత్తు
కేంద్ర పరిపాలన సంస్కరణల శాఖ అదనపు కార్యదర్శి వీ శ్రీనివాస్
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): దేశం మొత్తం మీద తెలంగాణలోనే భూముల డిజిటలైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయని కేంద్ర పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ అదనపు కార్యదర్శి వీ శ్రీనివాస్ చెప్పారు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఆటోమెటిక్గా మ్యుటేషన్ ఎక్కడా లేదని, ఆ విషయంలో మిగతా రాష్ర్టాల కన్నా తెలంగాణ ముందువరుసలో ఉన్నదని అన్నారు. హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కి), సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ అండ్ పెర్ఫార్మెన్స్(సీపీపీజీపీ) మంగళవారం ‘లీడర్షిప్ ఇన్ గవర్నెన్స్- ది హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్’ అనే అంశంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న రోజుల్లో పరిపాలనలో సాంకేతికత ముఖ్య పాత్ర పోషించనున్నదని, పరిపాలన భవిష్యత్తు మొత్తం డిజిటలైజేషన్పైనే ఆధారపడి ఉన్నదని తెలిపారు. 2022 నాటికి దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంతో మెరుగైన ఫలితాలు వచ్చాయని, 120 కోట్ల మందికి ఆధార్కార్డులు, 31 లక్షల మందికి జన్ధన్ ఖాతాలు ఇచ్చామని వివరించారు. డిజిటల్ పేమెంట్స్ను వీధివ్యాపారుల వరకు తీసుకురాగలిగామని తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించే దిశగా మరిన్ని డిజిటల్ ఆవిష్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రజల్లో సాంకేతికత వినియోగంపై పరిజ్ఞానం పెంచాలని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి మాజీ భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దున్ మాట్లాడుతూ గతంలో పోలిస్తే పరిపాలన వ్యవస్థ పరిధి పెరిగిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 18 ప్రభుత్వ శాఖలు ఉండగా, ఇప్పుడు 80కిపైగా శాఖలు ఉన్నాయని అన్నారు. అస్కి చైర్మన్, హోంశాఖ మాజీ సెక్రటరీ పద్మనాభయ్య మాట్లాడుతూ దేశంలో పథకాలు బాగున్నాయని, వాటి అమలులోనే లోపాలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్లు వైవీ రెడ్డి, దువ్వూరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.