పెండ్లిరోజు సందర్భంగా అవయవదానం హామీ పత్రం అందజేత
గార్ల, జూలై 7: పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు. మరణాంతరం శరీర అవయవాలను దానం చేసినవారికి మరణం లేదు. దీనిని నిజం చేసింది మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుటుంబం. గార్ల ఇందిరానగర్కాలనీకి చెందిన వల్లపుదాసు వెంకటేశ్వర్లు ఆటోడ్రైవర్. తన పెండ్లిరోజు సందర్భంగా బుధవారం కుటుంబసభ్యులైన తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్ల చేత తమ అవయవాలను దానంచేస్తామని పేర్కొంటూ అంగీకారపత్రాన్ని రాయించారు. అనంతరం ఆ పత్రాలను సంఘం జిల్లా అధ్యక్షుడు పరకాల రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ నేత్ర, శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్కుమార్కు అందజేశారు. వెంకటేశ్వర్లు కుటుంబాన్ని వారు అభినందించారు.