ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో బస్సులు నడిపే సిబ్బందికి బృహన్ ముంబై విద్యుత్ సరఫరా, రవాణా (బెస్ట్) సంస్థ జీతంలో కొంత భాగం నాణేల్లో చెల్లిస్తున్నది. దీంతో సిబ్బంది దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ సంస్థ ముంబై నగరంలో సుమారు నాలుగు వేల బస్సులను నిర్వహిస్తున్నది. అలాగే సుమారు పది లక్షల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్నది. ఈ నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించే వారి నుంచి చిల్లర, నగదు రూపంలో, విద్యుత్ బిల్లుల నుంచి నగదు రూపంలో ఆ సంస్థకు వసూలు అవుతాయి.
అయితే ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ బ్యాంకుతో కాంట్రాక్ట్ గడువు గత ఏడాది ముగిసింది. దీంతో సుమారు 150 కలెక్షన్ల సెంటర్ల నుంచి చిల్లర, నగదును ఆ బ్యాంకు సిబ్బంది తీసుకెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో చిల్లర నాణేలు, నోట్లు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. దీంతో గత కొన్ని నెలలుగా బస్సులు నడిపే సిబ్బందికి జీతంలో సగం రూ.2, రూ.5, రూ.10 నాణేలు, రూ.10, రూ.50, రూ.100, రూ.500 నోట్లలో చెల్లిస్తున్నారు. మిగతాది బ్యాంక్ ద్వారా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు.
మరోవైపు చిల్లర నాణేలను వెంట తీసుకెళ్లలేక, వాటిని మార్పిడి చేసుకోలేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను సంస్థ అధికారుల దృష్టికి యూనియన్లు తీసుకెళ్లాయి. దీంతో నాణేలు, నగదును కలెక్షన్ కేంద్రాల నుంచి సేకరించేందుకు సంబంధిత బ్యాంకుతో చర్చలు జరుగుతున్నాయని బెస్ట్ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. రెండు మూడు రోజుల్లో దీనిపై ఒప్పందం జరుగుతుందని, అనంతరం ఈ సమస్య తీరుతుందని వెల్లడించారు.