సభకు పరిచయం చేసిన చైర్మన్ గుత్తా
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): శాసనమండలికి కొత్తగా ఎన్నికైన సభ్యులు బుధవారం తొలిసారి సభకు హాజరయ్యారు. వీరిని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభకు పరిచయం చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గెలుపొందగా, గవర్నర్ కోటాలో గోరటి వెంకన్న, బస్వరాజ్ సారయ్య, దయానంద్ గుప్తా నామినేట్ అయ్యారు. వీరిని పరిచయం చేస్తున్నప్పుడు సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తంచేశారు.
ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు శాసనమండలి బుధవారం ఘనంగా నివాళి అర్పించింది. గతంలో శాసనమండలి సభ్యులుగా పనిచేసిన మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ రెవెన్యూమంత్రి కొణతం రాంరెడ్డి మృతిపై మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి, కొణతం రాంరెడ్డిల సేవలను సభకు వివరించారు. సభ్యుల మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన మండలి, వారి గౌరవార్థం సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
శాసనమండలి సభ్యుడిగా తొలిసారి సభకు హాజరైన ప్రజాగాయకుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పద్యంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కవులు, కళాకారులు ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం సమాజంలో ఉన్నదని, అదే సమయంలో ప్రజలకు న్యాయం, మంచి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వైపు ఉండటం తప్పుకాదని అన్నారు. 60 ఏండ్లపాటు తెలంగాణ ప్రజలు అనుభవించిన దుఃఖం ఆరేండ్లలో అంతమైందని చెప్పారు. ఇలాంటి అద్భుత ప్రగతిని కాలానుగుణంగా కవులు, కళాకారులు తప్పక అభినందించాలని అన్నారు. సమాజంలోని సమస్యలపై సంపూర్ణ అవగాహన, లోతైన పరిపక్వత ఉన్న నాయకులతోనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో అది తెలంగాణలో సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణలో పండుగలు, సంస్కృతి సంప్రదాయాలతో సమాజం అన్ని విధాలుగా పురోగమిస్తున్నదని చెప్పారు.