నవీపేట, మే 1: బర్రెదూడ పోయిందంటూ తాగివచ్చి అల్లుడితో ఘర్షణకు దిగటం పరస్పర దాడులకు దారితీసింది. దాడిలో కత్తులు, కర్రలు ఉపయోగించడంతో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన ముగ్గురు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకిరాబాద్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. స్థానికులు, సీఐ గురునాథ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రెడ్డిపల్లి పోశెట్టి(పశువుల కాపరి) పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని తన బర్రెదూడ పోయిందంటూ తాగి వచ్చి అల్లుడు లక్ష్మణ్తో ఘర్షణకు దిగాడు. అక్కడే ఉన్న దూరపు బంధువు నారాయణ కలుగచేసుకొని మందలించాడు. దీంతో పోశెట్టి, నారాయణ వర్గీయులు పరస్పరం కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో గంగాధర్, నరేందర్, లింగన్న, నారాయణ, సుగన్నకు కత్తిపోట్లు కాగా, మరో ఇద్దరు పోశెట్టి, అనిల్కు స్వల్ప గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు సీఐ గురునాథ్ తెలిపారు.