హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రైతులకు తెలంగాణ ఆగ్రోస్ అందిస్తున్న సేవలు ఎంతో బాగున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆగ్రోస్ కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు అందుతున్నాయని తెలిపారు. ఒక్క సంవత్సరంలోనే (2019-20) ఏకంగా రూ.123 కోట్ల టర్నోవర్ సాధించి ఆగ్రోస్ సత్తా చాటిందన్నారు. హైదరాబాద్లోని నాంపల్లిలో నూతన ఆగ్రోస్ భవనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయటం ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు రైతులకు నాణ్యమైన ఎరువులను అందిస్తున్నదని అన్నారు. కార్బైడ్ రహిత స్వచ్ఛ మామిడి, ఇతర పండ్లను వినియోగదారులకు అందించేందుకు ఎన్రైప్ పౌడర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. తెలంగాణ సిరి పేరుతో సిటీ కంపోస్టు ఎరువును ఆగ్రోస్ ద్వారా పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఆగ్రోస్కు చెందిన పర్యావరణహిత బయోడీగ్రేడెబుల్ కంపోస్టు బ్యాగును తిరుపతి లడ్డూ కోసం వినియోగిస్తున్నట్టు వివరించారు. ఆగ్రో కర్షక పెట్రోల్ బంకులు నెలకొల్పి నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించటంతో పాటు యువతకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆగ్రోస్ ఎండీ రాములు, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.