న్యూఢిల్లీ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశ రాజధానిని తాకిన తర్వాత తొలిసారిగా ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 20 శాతం దిగువకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో తాజా పాజిటివ్ కేసులు కూడా 12,651కి తగ్గడం అధికారులకు ఊరట కలిగిస్తోంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత కరోనా పాజిటివిటీ రేటు ఓ దశలో ఏకంగా 31.6 శాతానికి ఎగబాకడం ఆందోళన రేకెత్తించింది.
ఆపై గడిచిన కొద్ది రోజులుగా సగటున 20 శాతంపైనే ఉంటూ కలవరపెట్టిన కరోనా పాజిటివిటీ రేటు తాజాగా 19.10 శాతంగా నమోదైంది. మరోవైపు కరోనా కట్టడికి ఢిల్లీలో లాక్డౌన్ ను మే 17 వరకూ పొడిగిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కేజ్రీవాల్ సర్కార్ ఈసారి మెట్రో రైలు సేవలను నిలిపివేసింది. బహిరంగ ప్రదేశాలు, బాంక్వెట్ హాల్స్, హోటళ్లలో పెండ్లి వేడుకలను రద్దు చేసిన ప్రభుత్వం లాక్డౌన్ సమయంలో పరిమిత సంఖ్యలో ఇండ్లలో పెండ్లిండ్లకు అనుమతించింది.