మసీదుల నిర్మాణంపై ముగిసిన విచారణ
హైదరాబాద్, మార్చి 15: (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని సచివాలయం ప్రాంగణంలో కూల్చివేసిన రెండు మసీదులను తిరిగి నిర్మిస్తామన్న ప్రభుత్వ హామీని రాష్ట్ర హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. మసీదుల కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలు, ఒక రిట్ పిటిషన్పై విచారణ ముగిసినట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ప్రకటించింది. ఇంతకుముందు ఇదే కేసుపై సింగిల్ జడ్జి ముందు కూడా విచారణ జరిగినప్పుడు.. కూల్చివేసిన మసీదులను తిరిగి నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది హరేందర్ పరిషద్ తెలిపారు. దీంతో సింగిల్ జడ్జి ఈ కేసును మూసివేశారని గుర్తు చేశారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది కల్పించుకుంటూ.. కూల్చివేసిన స్థలంలోనే మసీదులను నిర్మించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా, హైకోర్టు తిరస్కరించింది. మసీదుల నిర్మాణంపై ప్రభుత్వ హామీని పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాలను మూసివేస్తున్నట్టు ఆదేశాలు జారీచేసింది.