హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని, ఇందుకు రాతపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. ప్రభుత్వం అనుమతిచ్చిన 1,061 పోస్టుల భర్తీకి కేంద్రీకృత విధానంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని యోచిస్తున్నారు. రెండో దశలో మరికొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లను (వీసీ) ఆదేశించారు. మంగళవారం నాంపల్లిలోని రాష్ట్రీయ ఉచత్తర్ శిక్షా అభియాన్ (రూసా) కార్యాలయంలో 11 యూనివర్సిటీల వీసీలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పోస్టుల భర్తీపై ఈ సమావేశంలో మూడు రకాల ప్రతిపాదనలు వచ్చినట్టు తెలిసింది. పోస్టుల భర్తీ యూనివర్సిటీల చేతుల్లో పెట్టరాదని, బీహార్ తరహాలో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, లేదా టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టాలని వీసీలంతా అభిప్రాయపడ్డట్టు సమాచారం. రాతపరీక్ష నిర్వహణపైనా ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది. ఈ అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని, ప్రభుత్వం అనుమతినిచ్చిన మేరకే నిర్ణయాలుంటాయని ఓ అధికారి చెప్పారు. సమావేశంలో ఉన్నతవిద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్రావు, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, వీసీలు ఎస్ మల్లేశం, రవీందర్, తాటికొండ రమేశ్, రవీందర్గుప్తా, కిషన్రావు, కట్టా నర్సింహారెడ్డి, లక్ష్మీకాంత్ రాథోడ్, కవిత దర్యాని, సీతారామారావు, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యూనివర్సిటీలకు స్వయంప్రతిపత్తి ఉండటంతో ఇంతకాలం సొంతంగానే అవసరమైన టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగాలు భర్తీచేసుకొనేవి. అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారానే ఎంపికచేసేవారు. వర్సిటీ వీసీ, గవర్నర్ నామినీ, యూజీసీ నామినీ, ఫ్యాకల్టీ డీన్, డిపార్ట్మెంట్ హెడ్, ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు (ఇతర వర్సిటీలవారు) ఆయా పోస్టు రోస్టర్, రిజర్వేషన్ను బట్టి ఎస్సీ, ఎస్టీ, వికలాంగ, మహిళా నామినీలతో కూడిన కమిటీ ఇంటర్వ్యూలను నిర్వహించేది. ఈ పద్ధతి లోపభూయిష్టంగా ఉందని అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో గందరగోళానికి తావులేకుండా ఈసారి రాతపరీక్ష, ఉమ్మడి నోటిఫికేషన్ను జారీచేయాలని భావిస్తున్నారు.
బీహార్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రత్యేకంగా స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. 2017లో దీనిని ఏర్పాటుచేసి 2020 సెప్టెంబర్లో 52 సబ్జెక్టులకు సంబంధించి 4,638 ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ను జారీచేశారు. ఎలాంటి చిక్కులు లేకుండా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. ఇదే పద్ధతిని మన రాష్ట్రంలో అనుసరించాలని అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీకాలేజీలను కలుపుతూ ఏర్పాటు చేయాలనుకుంటున్న క్లస్టర్ విధానంపై మరోమారు భేటీ కావాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించారు.