న్యూఢిల్లీ : కోవిన్ పోర్టల్లో కొత్తగా తెలుగు భాషను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. హిందీతో పాటు మొత్తం పది ప్రాంతీయ భాషలను పోర్టల్లో అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. ఇందులో తెలుగు సహా మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా, ఇంగీష్ భాషలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతున్నది.
18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్ వేసుకునేందుకు కోవిన్ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఇంగ్లీష్ అందుబాటులో ఉండడంతో.. ఆ భాష రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యమంత్రిత్వ శాఖ మార్పులు తెచ్చింది. దీంతో ఇకపై రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్లు మరింత తేలిక కానున్నాయి.
గత నెల 17న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన జరిగిన జరిగిన ఉన్నత మంత్రుల బృందం సమావేశమైంది. ఇందులో హిందీ సహా 14 భాషలను పోర్టల్లో తీసుకువచ్చేందుకు మంత్రుల బృందం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పరీక్షించిన శాంపిల్స్ సంఖ్యను పెంచడానికి, మరింత ప్రాదేశిక విశ్లేషణకు అనుమతించడానికి 17 కొత్త ల్యాబరేటరీలను ఇన్సాకోగ్ నెట్వర్క్కు చేర్చబోతున్నామని హర్షవర్ధన్ తెలిపారు. ఈ నెట్వర్క్ ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 10 ల్యాబరేటరీల ద్వారా సేవలు అందిస్తోంది.