హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజైన నేటి నుంచి పూర్తి స్థాయి అజెండాపై చర్చ జరగనుంది. సోమవారం నుంచి ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. హైదరాబాద్లో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు పనులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు, ఉస్మానియా దవాఖానలో ట్విన్ టవర్ల నిర్మాణం, గొర్రెల యూనిట్ల పంపిణీ, జనపనార మిల్లుల ఏర్పాటు, కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అంశాలు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి.
పరిశ్రమలు, ఐటీ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ ఉభయసభల ముందు ఉంచనున్నారు. గృహనిర్మాణం, ఉద్యానవన వర్సిటీ బిల్లులను సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెట్టనున్నారు. గత శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల వచ్చే నెల 5 వరకు జరగనున్నాయి.