హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్పై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదవులు శాశ్వతం కాదు..రాష్ట్రం శాశ్వతం అని అన్నారు. రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా సంజయ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఓ జాతీయ ప్రాజెక్టు తెస్తే..నిండు సభలో సన్మానం చేస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీలో హరీశ్ రావు ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం నడిచింది. నీటిపారుదల రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. మండుటెండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల విలువ లక్ష కోట్లు దాటింది. ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేస్తున్నాం. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించుకున్నాం. వాగులపై చెక్డ్యాంలను నిర్మిస్తున్నాం. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు. గుజరాత్ ప్రభుత్వం నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యాం పూర్తి చేయడానికి 37ఏండ్లు పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చెరువులను పట్టించుకోలేదు. చెరువుల కింద 15లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేశాం. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశాం. ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని’ హరీశ్ రావు చెప్పారు.